Wednesday 30 December 2015













మందాక్రాంత వృత్తంలో సాగే వేదాంత దేశికులవారి హంస సందేశ కావ్యం లోని వస్తువు- రాజ హంసతో శ్రీరాములవారు- అశోకవనంలోనున్న తన ధర్మపత్ని సీతాదేవికి సందేశాన్ని పంపటం. అసలు మందాక్రాంత వృత్తం అంటే? మందం ఆక్రమితి- మెల్లగా కొండచిలువవలె నెమ్మదిగా సాగే వృత్తం అని పెద్దలు చెబుతారు. క్షేమేంద్రుని ప్రకారం, విరహ బాధను వర్ణించేందుకు బహు బాగుగా పనికి వచ్చే వృత్తమిది. పరకాల నాయకీ(పెరియ తిరుమొళి) పరాంకుశ నాయకీ (తిరువాయ్ మొళీ) వీరిరువురూ, కొంగలనూ, చిలుకలనూ తమ సందేశవాహకులుగా వినియోగించుకున్నారు. కాళిదాసు మేఘ సందేశం యెలాగూ వుండనే వుంది.
'సర్స్వతంత్ర స్వతంత్ర'  'వేదాంతదేశిక', ' కవితార్కికకేసరి', 'ఘంటావతార' .ఇలా యెన్నో బిరుదులు కలిగిన యీ వేంగడనాధుడు, అద్వైత, శైవ, అలంకర శాస్తాలలొ పారీణులైన అప్పయ్య దీక్షితుల గౌరవాన్నందుకున్న వేదాంతస్వరూపుడు. వేదాంత దేశికుల రచన 'యాదవాభ్యుదయా నికి, అప్పయ్య దీక్షితులవారు చక్కని వ్యాఖ్యకూడా వ్రాశారట!

        మరి ఇందులో, వేదాంత దేశికులవారు, హంసను వాడుకోవటం, జ్ఞాన స్వరూపమైన సత్వ స్వరూప నిరూపణకోసమనే తేటతెల్లమౌతుంది. ఇక వివరాల్లోకి వెళితే, యీ కావ్యంలో భారత దేశ నైసర్గిక భౌగోళిక స్వరూపం గురించి వేదాంత దేశికులవారికున్న సంపూర్ణ పరిజ్ఞాన0 విశదమవటమే కాక, శ్రీవైష్ణవ తత్వ సారాన్నంతా ఇందులో పొదిగి కావ్యరూపమిచ్చిన వైనం- అద్భుతమనిపిస్తుంది తప్పక!

          ఈ కావ్యంలోని ప్రతీకాత్మక ధర్మ సూక్ష్మాలు కొన్ని. శరీరమే లంక. సంసారమనే సముద్రంలో మునిగివున్నది- అహంకార పూరిత హృదయం. (పది ఇంద్రియాల వశంలో వున్న రావణుని వంటి శరీరంలో) జీవం బందీగా (విషయనుభవాల ముసుగులో) వుంది-అచ్చు సీతమ్మవారివలె! శ్రీరాముడే భగవంతుడు. హంస- ఆచార్యుని రూపంలో పరమాత్మ సందేశాన్ని తీసుకుని వెళ్ళి , ముందు అతని కళ్యాణ గుణప్రశంసచేసి, తనను తాను కాపాడుకునే విధానాన్ని తెలుపుతుంది జీవాత్మకు! అసలు రామాయణమంతా శరణాగతి వేదమేనని శ్రీవైష్ణవుల వాదం. (కడపలో ఒకసారి విశ్వనాధవారికి ఘనంగా సన్మానం జరిగింది. 1976-77లో ననుకుంటా! విశ్వనాధ 'నాకు రామాయణం గురించి తెలిసినంతగా వేరెవరికీ, తెలియదేమో' అన్నారు ..అయ్య ఆ సభాధ్యక్షులు. ఆయనన్నారూ 'మా శ్రీవైష్ణవ సిద్ధాంతం ప్రకారం వాల్మీకి రామాయణానికి పద్ధెనిమిదిదాకా వ్యాఖ్యలున్నాయి. అవేమిటో నాకు తెలుసు. నీకు తెలిస్తే చెప్పు. ఇప్పుడే మాట్లాడుకుందాం' అని సవాల్ విసిరారు. విశ్వనాధ వారికి అయ్య సంగతి తెలుసు బాగా అప్పటికే..అందుకే నిజమేక కాబోలు లేవయ్యా!' అని తానే సర్ది చెప్పారు అప్పటికి..అప్పటి పాండిత్యాలూ..అప్పటి స్పర్ధలూ లేని బావిలో - కప్పల్లా, చీకటి రోజుల్లో బ్రతుకుతున్న మనకెందుకీ కథలన్నీ! కదా!) ఇది ఇప్పుడు అప్రస్తుతమైనా, ఒకసారి మా అయ్యనలా తలచుకుని ముందుకు!.. అప్పటిదాకా శృంగార రసాస్వదనలో తలమునకలై వున్న కవితాలోకానికి ఆధ్యాత్మిక సౌరభ సౌఖ్యాన్ని ఆస్వాదింపజేసేందుకే, సాక్షాత్తూ, ఆ తిరువేంకట నాధుడే, వేదాంత దేశికుల రూపంలో ఇలపై అవతరించారనీ ఒక వాదం ప్రబలంగా వినిపిస్తుంది.
(నేను పీహెచ్. డీ చేసేటప్పుడు, వేదాంతదేశికులవారి హంస సందేశ కావ్యం గురించి తెలిసింది. అప్పుడు, దొరికిన కొన్ని శ్లోకాలతో సరిపిపెట్టుకోవలసి వచ్చినా, తరువాత, యే సందర్భం దొరికినా, యీ హంస సందేశం గురించి బాగానే వెదికాను- నిరాశే మిగిలింది. అడపా దడపా దాన్ని గురించి వాకబులూ, శోధనలూ చేస్తూ, కొంత విషయ సేకరణ చేసినా, ఇటీవల యీ కావ్యం పూర్తి పాఠం దొరకటం నా అదృష్టంగానే భవిస్తూ, యీ ధనుర్మాస పావన తరుణంలో, ఈ కావ్యం గురించి మరికొన్ని విశేషాలు నా ఊహకందినంత వరకూ త్వరలో)




Tuesday 29 December 2015


                                                          యెమ్మేకోణా.....
                          వున్నట్టుండి..
                   మది తలుపు తెరుచుకున్న చప్పుడు.
                   తలెత్తి చూద్దునుగదా..
                   బిక్కమొహం వేసుకుని,
                   దీనంగా నిలబడిందో నల్లటి  ఆకారం.......
                   కళ్ళతోనే ప్రశ్నించా యేమిటని..
   సమాధానం లేదు.
   మళ్ళీ రెట్టించా..
   'యెవరు నువ్వు?
   నాతో పనేంటి?
   యెందుకా నిర్వేదం?
   యేమిటా  మౌనం?' అని..
                    అడగ్గా అడగ్గా, అప్పుడు నోరు తెరిచిందా ఆకారం.
                    గొంతు వినటానికి ఇబ్బందనిపించినా,

                    తప్పదు కదా అని సర్దుకుని,
                    చెవులు అటు పడేశా!
   'నా ఊసే మరచిపొయావే?...'
   మీ అమ్మగారికెంత  ఇష్టమైన దాన్ని కదా నేను?
   నన్నెలా  మర్చిపోయావ్?
   మీ ఇల్లు చిలకలు వాలిన మమిడి చెట్టై పోయేదిగా,
   ప్రతి వేసవిలోనూ?
   మనుమలూ, మనుమరాండ్ల అల్లరిని చూస్తూ,
   తాతగారు,
   తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకునేవారు కదా!
   వాళ్ళ అల్లరికి పెద్దలు కోప్పడితే,
  ' ఇంకా బాగా అల్లరి చేయండ్రా వెధవల్లారా'  అంటూ
  పిల్లలందరినీ తెగ ప్రోత్సహించేవారు.
  తన చిన్ననాటి ముచ్చట్లూ మీ అందరితో పంచుకునేవారు,
   ముసి ముసిగా  నవ్వుతూ!
   మీ అమ్మైతే,
   పెద్ద కంచంలో పట్టెడేసి  ముద్దలు కలిపి,
   ప్రేమగా ,
   కథలూ, కాకరకాయలూ చెబుతూ,
   వాళ్ళకు తినిపించేది కదా! 
   ఆఖరున, ఇక మావల్లకాదని పిల్లలంతా ఆపసోపాలు పడుతుంటే,
   అప్పుడు నా వంతొచ్చేది.
   ' ఒందూ గందదు బిళ్ళా, (  గంధం బిళ్ళా - మొడటి  ముద్ద)
     యెరడూ గరుడా గంబా, ( గరుడ స్థంభం- రెండో ముద్ద)
    మూడూ ముత్తెపు చిప్పా, ( ముత్తెపు చిప్ప- మూడో ముద్ద)
   నాలుగూ  నాగప్పా, ( నాగ దేవత-నలుగో ముద్ద)
   ఐదూ కంటీ సారా, ( కళ్ళద్దాలు- ఐదో ముద్ద0
   ఆరూ దానిమ్మా ..( దానిమ్మ- అరూ ముద్ద)
    యేడూ....యేడూ..
    అనగానే పిల్లలంతా పరుగో పరుగు....
    మాకొద్దు..మాకొద్దు  అంటూ..
    ఇంతకూ..
    యేడూ...యెమ్మేకోణా...కద..
    యెమ్మేకోణా ..అంటే   యెనుము (బర్రె) అని తెలుగర్థం కదా!  .
    ఆ యెమ్మేకోణా ను నేనే..
    నా   లాగా యెవరూ   కాకూడదనే
    యెవరికి వారు,
   కంచం ముందునుంచీ వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలంతా!
   నన్ను కాదని  అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయినా,
   ఇప్పుడు,
  వాళ్ళకు తెలియకుండానే అందరూ..
   యెమ్మేకోణలై   పోయారుగా!
   యెమ్మేకోణా- అంతే చదువు రాని దద్దమ్మలే అని కాదు అర్థం.
   జీవితంలో యే అపురూప జ్ఞాపకాలకూ విలువనివ్వక,
   కళ్ళు మూసుకుని,
   తను నమ్మిందే వేదం, తనదారే రహదారి ..
   అనుకుంటూ,
   తమదైన మార్గంలో  నడిచే,
   గడసరి చర్మమున్న ప్రతి వారూ యెమ్మేకోణలే!
   ఈ నిజాన్ని చెప్పాలనే వచ్చా!
   నన్ను యెగతాళి చేసి,
   నా పేరొచ్చిన ప్రతిసారీ,
   అసహ్యాన్ని కనబరచిన వాళ్ళంతా,
   యెవరి పరిధిలో వాళ్ళూ,
   నా రూపం ధరించినట్టే సుమా!
   'దున్నపోతు మీద వాన కురిసినట్టు, '
   'వాడో దున్నపోతులే!'
   'దున్నపోతుకు, చర్మం మందం..'.
    ఇలా  నన్ను దృష్టిలో పెట్టుకుని
   సృష్టించిన సామెతలన్నీ,
   యీనాటి ప్రతి మనిషికీ వర్తిస్తాయని,
   అందరూ తెలుసుకోవాలని చెబుదామని  వచ్చా..అంతే!'
   ఠక్కున నా ముందటి ఆకారం మాయమైంది..
   ఐతే నేను  కూడా....
   అమ్మో.........
   (నిజానికి, మా అమ్మ తన మనుమళ్ళకూ, మనుమరాండ్రకూ, అన్నం పెడుతూ, యీ పొట్టి  గేయం కన్నడంలో వినిపించేది మా   చిన్నప్పుడు..మా ఇంట కన్నడ పలుకుబళ్ళూ,  పదాలూ కూడా బాగానే వాడుకలో వుండేవి మరి... ఆ జ్ఞాపకం  గుర్తుకు రాగానే.. నా మదిలో తలెత్తిన ఆలోచనిది. జ్ఞాపకం  యెప్పటిదో ఐనా, ఇప్పటి అన్వయం- మనందరికీ వర్తిస్తుందనే అనిపిస్తుంది నామట్టుకు నాకు! మరి మీరేమంటారో! మీ అభిప్రాయమేదైనా,  నాదృష్టిలో, యెమ్మేకోణలుగా మనమంతా, యెవరిలొకంలో వాళ్ళు జీవిస్తున్న ముదురు చర్మం జీవులమే  కదా మరి! ఇది కేవలం నా సొంత ఊహే  కానీ, యెవరినీ ప్రత్యేకించి  వుద్దేశించి వ్రాయలేదని గమనించ ప్రార్థన.  యెమ్మేకోణ ( దున్న లేక  యెనుము) కు క్షమాపణలతో) ......




                           నయన నయ భాషణం


           కనులు మాటలాడుననీ,మనసు పాట పాడుననీ' అంటూ కనులు మాట్లాడే సంగతిని నాయికా నాయకుల ప్రణయ విహారంలో చక్కగా వాడుకున్నారు సినీకవులు. 'కన్నులే నీకోసం కాచుకున్నాయీ' మరో సినిమాలో నాయకుడు నాయికకోసం తన యెదురుచూపులనీవిధంగా  ఆవిష్కరించాడు. 'నాలుగు కళ్ళు రెండైనాయీ-రెండు మనసులు ఒకటైనాయీ' అంటూ అసలు ప్రేమావిష్కరణకు కళ్ళు కలుసుకోవటమే తొలి అడుగుగా తేల్చేశారు కూడా! 'నా కంటి పాపలో నిలిచిపోరా' అని ఒక ప్రియురాలు తన ప్రియుణ్ణి ఆహ్వానిస్తే,  'కళ్ళలో  ఉన్నదేదో కన్నులకే తెలుసూ' అని పాడుకుంటుందొక బాధాతప్త నాయిక! ఇంతకూ, సందర్భం యేదైనా, కళ్ళకున్న  ప్రాధాన్యత మరే అవయవానికీ ఉండదని,ఇప్పుడు మన సినీకవులు ఘంటాపథంగా చెప్పారు . యీ సంగతిని మన కవులు యేనాడో నొక్కి చెప్పారు- తమ రచనల్లో!  'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం' అని యెప్పుడో   వాళ్ళెందుకన్నారంటే, కళ్ళు లేకుంటే, జీవితమంతా అంధకారమయమనీ,జీవితానందమనుభవించటంలో కళ్ళదే ప్రధాన పాత్ర అనీ వాళ్ళ అభిప్రాయం. కళ్ళతో సకల ప్రపంచాన్ని చూసి ఆనందించటం ఒక యెత్తైతే,ప్రణయప్రపంచంలో కళ్ళప్రాముఖ్యత మరో యెత్తనీ, దాన్ని వొట్టి మాటల్లో వర్ణించటంకంటే కవితాత్మకత జోడించి చెప్పటంతోనే  దానికి సరైన  న్యాయం జరుగుతుందనీ మనకవులేనాడో గ్రహించారు కాబట్టే, కన్నుల భాషలను తమ కావ్యాలలో ఇలా ఆవిష్కరించారనవచ్చు.     సంస్కృత సాహిత్యం మొదలు, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల సాహిత్యాలలో కళ్ళ కనికట్టునెలా కవిత్వీకరించారో చూద్దామా! 
               కవికుల గురువు గా కీర్తినొందిన కాళిదాసు తన కుమార సంభవంలో పార్వతీదేవి కళ్ళనిలా వర్ణించాడు.   చంచలములూ, ఆకర్షణీయములూ, నల్లని కాంతులతో మిలమిలలాడే హరిణముల నేత్రాలతో ఆడవారి  నేత్రాలను పోల్చటం ఆనవాయితీగా వస్తున్నది చాలాకాలం నుండీ! మరి కాళిదాసు యేమంటున్నాడు?        
             ప్రవాళ నీలోత్పల నిర్విశేషమధీరవిప్రేక్షిత మాయతాక్ష్యా,
             తయా గృహీతం ను మృగాంగనాభిస్తతో గృహీతం ను మృగాంగనాభి :
                                      (కుమారసంభవం-కాళిదాసు)
         పార్వతి కన్నులు  తుఫానులో కదలాడుతున్న నీలితామరల వలె ఉన్నాయి.వాటి చంచలతను చూస్తే, సందేహమౌతుంది- ఆమె ఆ చూపులను హరిణాలనుండీ నేర్చిందా, లేక హరిణాలే ఆమె నుండీ నేర్చాయా అని!.. అంతేనా!   
           తస్యాహ శలాంకాంజన నిర్మితేవ,కాంతిర్భువోరాయత లేఖయోర్యా
           తాం వీక్ష్య లీలాచతురామనంగ :  స్వచాప సౌందర్య మదం ముమోచ.
                                        (కాళిదాసు-కుమారసంభవం)
         'పార్వతి యొక్క మనోహరములైన పెద్ద కనుబొమలు, యెవరో తూలికతో వేసినట్టే వున్నాయి.తన ధనువును చూసి కామదేవునికున్న పొగరును, ధిక్కరించేలా ఉన్నాయవి..'  కాళిదాసు మాళవికాగ్నిమిత్రం లోనూ మనోజ్ఞమైన నేత్రవర్ణన వుంది. కాళిదాసు స్త్రీమనస్తత్వ విజ్ఞానంలోనూ ఆరితేరినవాడని నిరూపించే సందర్భాలు చాలా ఉన్నాయి.. నాల్గవ అంకంలో రాజు కళ్ళగురించి చెప్పే యీ మాటలు, ప్రేమికులకే అర్థమౌతాయి మరి..
           కాత్స్యేన నివర్ణయితుం చ రూపమిచ్ఛంతి తత్పూర్వసమాగమానాం,
           న చ ప్రియేష్వాయతనానాం సమగ్రవృత్తీని విలోచనాని..
 అంటే, తమ ప్రియులను కలవటానికి ఆరాటపడే స్త్రీలు, సహజంగానే సిగ్గరులుగా ఉంటారు. మొట్టమొదట తాము కలసిన పురుషులను కళ్ళనిండా చూసుకోవాలనే వారికి ఉంటుంది. కానీ వాళ్ళ పెద్ద పెద్ద కళ్ళూ, తమ ప్రేమికులముందు, పూర్తిగా తెరచుకుంటేకదా!' ఈ అసమంజస స్థితి లోనే, వారి సమయమoతా గడచిపోతుంది మరి! కానీ కళ్ళ యీ విధమైన స్థితికూడా, ఒక భాషవంటిదే కదా మరి!
        'అభిజ్ఞానశాకుంతలం 'లో దుష్యంతుడు శకుంతల కనుల ద్వైధీభావాన్ని కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాడు చూడండి.
            అభిముఖే మయి సం హృతమీక్షితం,హసితమన్య నిమిత్త కృతోదయం,
            వినయవారితవృత్తి రతత్ స్తయా న విద్ధతో మదనో న చ సంవృత :
          'నేను ఆమె వదనంవైపు చూస్తున్నప్పుడు, ఆమె తన వదనాన్ని అటు తిప్పుకుంటుంది. యేదో కారణంతో నవ్వేస్తుంది కూడా! సిగ్గువల్లనే, ఆమె అటు తన ప్రేమను దాచుకోనూలేక, ఇటు ప్రకటించనూలేక సతమతమవుతున్నది.' మొత్తానికి, అటు సిగ్గు వల్లో,  ఇటు శీల నిర్వహణవల్లో స్త్రీలు తమ ప్రణయ భ్హావాన్ని బయటపెట్టలేకపోవటమున్నా, అది కూడా వారికి అలంకారంగానే పరిణమిస్తూ, మరింత ఆకర్షణను పెంచుతుందేమో!
            భవభూతి అనగానే, కరుణరసాన్ని పండించిన కవివతంసునిగానే గుర్తిస్తున్నారు కానీ, సంయోగ వియోగ  వర్ణనలోనూ అతనిది అందెవేసిన చెయ్యేనని కొన్నీ వర్ణనల ద్వారా తెలుస్తున్నది. వారి మాలతీమాధవ నాటకంలో, సమ్యోగ వియోగ వర్ణనలు రసపరిపాక దశలో ఉన్నాయి.
        మామూలుగా, కన్నులు అదరటం కొన్ని సూచనలు చేస్తాయని అందరూ నమ్ముతారు కదా! పైగా పురుషులకు కుడికన్నూ, స్త్రీలకు యెడమ కన్నూ అదిరితే చాలా మంచి శకునంగాకూడా భావించటం ఇప్పటికీ ఉన్నది. ఇలా నేత్రాలు అదరటం గురించిన నమ్మకాన్ని, భవభూతి మాలతీమాధవుల   వల్ల 'స్ఫురతా వామకేనాపి' అంటూ, వామనేత్రం అదరటాన్ని వారిరువురి పరిణయానికి శుభసంకేతంగా ధృవీకరించాడు కూడా!  ఇక ,  మాలతి సౌందర్యాన్ని పొగడుతూ మాధవుడన్న మాటలు..
                    స్తిమితవికసితానాముల్లసద్భూలతానాం,
                    మసృణముకులితానాం ప్రాంతవిస్తారభాజాం,
                   ప్రతినయననిపత కించిదాకుంచితానాం,
                   వివిధమహమభావం పాత్రమాలోకితానాం..
  'ఆ సుందరి రెండు నేత్రాలూ, ఒక నిముషం నిశ్చలంగానూ, మరో నిముషం సుప్రసన్నంగానూ, ఇప్పుడు పైకెత్తిన కనుబొమలతోనూ, మరొకప్పుడు విశాలంగానూ, ఒకసారి కోమలభావంతో అర్ధనిమీలితాలై, మరో క్షణం-నా కళ్ళతో కలిసినప్పుడు సిగ్గుతో సంకుచితాలై- ఇలా భిన్న క్షణాల్లో భిన్న భావాలకు నేనామె కళ్ళకు ఆశ్రయమైనాను.'
 ఇలా విద్యుత్ గతిలో కళ్ళలో భావాన్ని మార్చటమన్నది, కేవలం కళ్ళకేఉన్న శక్తి.సామర్థ్యం కూడా!  మాధవుడు ఆ కళ్ళ ఆకర్షణకు చిక్కాడంటే ఆశ్చర్యమే లేదు మరి!
           అలస వలిత ముగ్ధ స్నిగ్ధ నిష్యంద మందై,
           రధిక వికస దంతర్విస్మయస్మేరతారై :
           హృదయమశరణం మే పక్ష్మలాక్షాహ కటాక్షే
           ఖలతమపవిద్ధం  పీతమున్మీలితం చ..
     'సిగ్గు వల్ల యేమీచేయలేకా, మళ్ళిచూడాలన్న కోరికతో వంకరగా, లక్ష్యాన్ని వదలి మరెక్కడికీ వెళ్ళలేనివీ, నెమ్మదిగా అతిశయ విస్తారంతో, మదిలోపల ఆశ్చర్యం వల్ల వేగంగా కదలాడుతున్న కనుపాపలతో, ఆ దీర్ఘమైన కనుబొమల సుందరి చూపులు, నా నిస్సహాయమైన    మనోహరమైనహృదయాన్ని అపహరించాయి. దానిపైన క్రూరంగా దాడి చేశాయి. నా హృదయాన్ని తాగేశాయి. దాన్ని నిర్మూలించేశాయి.'   కనుబొమలుకూడా కళ్ళకు సంబంధించిన అంగాలే! రెండుగా ఉన్నప్పటికీ ఒకే భావాన్ని వ్యక్తపరుస్తుంటాయవికూడా! కళ్ళకు తమ సంపూర్ణసహకారమందిస్తూ, ఒకింత కళ్ళభావాన్ని మరింత మెరుగుపరుస్తూకూడా వుంటాయవి.వీటికితోడు ముఖమూ, మెడా కూడా కళ్ళకి సహకరిస్తే యెలా ఉంటుందో ఇదిగో, భవభూతి మాటల్లో గమనించండి.
                            యాంత్యాముహుర్బలిత కంధరమాననం త
                            దావృత్తవృంత శతపత్ర నిభం వహంత్యా
                            దిగ్ధోమృతేన చ విషేణ చ పక్ష్మలాక్ష్యా
                            గాఢం   నిఖాత   యివ మే హృదయే  కటాక్ష :  ...
  'మాటిమాటికీ తన మెడ తిప్పుతూ, గాలికి అటూ ఇటూ తిరిగే కమలంవలె, మనోహరమైన మోముగల ఆ సుందరి, తన చిక్కనైన కనుబొమలతోకూడిన కన్నుల ద్వారా, అమృతమూ విషమూ రెండింటిలో తడిపిన చూపులను, నా హృదయంపై సంధించింది.'
               భవభూతి  'మాలతీమాధవం' లో మదయంతిక, మకరంద్ ల ప్రేమ ప్రకరణాన్నికూడా, యెంతో హృదయాభిరామంగా వర్ణించాడు.ఇరువురి కన్నుల భాష గురించి కామందకి (యోగిని) మాటల్లో:
                  ఈషత్తిర్యగ్వలనవిషమం కూపిణ కూణిత ప్రాంతమేత-
                  త్ప్రేమోదేభదస్తిమిత లలితం కించిదాకుంతితభ్రు'
                  అంతర్మోదానుభవమసృణం,స్రస్త నిష్కంప పక్ష్మ
                  వ్యక్తం శంసత్యచిరమనయో ర్దృష్టిభాకేకరాక్షం
 'వీరిరువురి కళ్ళు, ఒకరినొకరు చూసుకునేటప్పుడు, కాస్త వక్రించాయి. ఒకే వైపునమాత్రమే పూర్తిగా వికసితంగా వున్నాయి. అనురాగప్రకటనం వల్ల నిశ్చలములూ, మనోహరములూకూడా అయ్యాయి. అంతరాంతరాలలో ఆనందానుభూతివల్ల అనురాగరంజితాలయ్యాయి. కనుపాపలు, నిశ్చలంగా ఉన్నాయి.   ఇలా అప్పుడప్పుదూ వికసితంగా, మరొసారి సంకుచితనేత్రాలతో పరస్పర దర్శనంవల్ల, వీరిరువురి మధ్య మానసిక సంగమమైనట్టే తోస్తున్నది. '      ఇక్కడ భవభూతి కేవలం ప్రేమలో ఉన్నవారికెకాక, చూసేవారికి కూడా ఆ చూపుల  అర్థం అవగతమౌతాయంటున్నాడు.
      మరో సందర్భంలో మదయంతిక మాలతీమాధవుల ప్రణయం నేత్రాల ద్వార వ్యక్తీకరింపబడిన వైనమూ వివరంగా చెబుతుంది. 'కుసుమాకరోద్యానంలో వీరిరువురూ తొలిసారి కలిసినప్పుడు, నీలకమలాల్లా,  వీరిరువురి కనులూ, వివిధ ప్రస్తారాలు చేస్తూ, మాటిమాటికీ మూతపడటమూ, మళ్ళీ అంతలోనే విహ్వలతతో తెరచుకోవటమూ కూడా, నేను చూడలేదా? కనుపాపలు కూడా వీరిరువురి హృదయగత ప్రణయభావనకు అనుకూలంగానే నర్తించాయి. కామదేవుని అన్ని శాస్త్రాల వుపదేశాలనూ నైపుణ్యంతో ప్రదర్శిస్తున్నాయా అనిపించింది సుమా!
           ప్రబంధ సాహిత్యానికి నాడీమండలం వంటి అన్నమయ్య పదాలలోనూ,  కన్నుల వర్ణన సమ్మోహనమే! 'చెలియ చూసిన చూపు-చీకటిలో వెన్నెల'అంటాడొకచోట! 'గాలాల వంటి చూపు' అంటాడు మరోచోట! (ఇంకానేలదాచేవు అన్న పదంలో) 'తొలసితో మొల్లలట్టే తురిమీ చూపులను' అంటాడు - ఇటువంటి వేడుక అన్న పదంలో!'చిత్తజుని యమ్ములును చెలియజూపులు' (బిగిసేవింకా) 'వాలుకజూపులు'( అల్లదె మేడమీద) అని స్త్రీల చూపులను వర్ణిస్తూ, 'కన్నులు చెదరి చెలి గ్రక్కున రెప్పలు వంచె, వెన్నెలో అది నీకు వేసగో' నీవే తేల్చుకోవాలి సుమా అని వెంకటేశుని హెచ్చరిస్తాడు కూడా!  'కన్నుల జూచినప్పుడే, కాకలెల్లా బెడబాసె' (ఇచ్చకమే మది) అంటూ, ఆ కన్నుల్లో చెప్పరానికారాలే చిందుతాయని - కాంతలగుణాలిటువంటివి సుమా అని జాగ్రత్తలు చెబుతాడు వెంకటేశునికి! (యీవల కాంతల)  మగవాని నవ్వునూ వర్ణించాడాయన - 'వెన్నెలవంటిదింతే వెస మగవాని నవ్వు-యెన్నిచోట్ల గాసిన నేమాయెనే'..అంటాడు. (ఇద్దరూనేకములై)  అసలు కన్నుల బాసల విషయంలో అన్నమయ్య ఆవిష్కరించని అందాలు లేవంటే అతిశయోక్తి కాదేమో!
                ప్రబంధ సాహిత్యంలో, పెద్దనామాత్యునికి పెద్దపీటే వేసి గౌరవించాడు కృష్ణదేవరాయలు. మనుచరిత్రలోని పద్యాలన్నీ, రసగుళికలే!    ప్రవరాఖ్యుని చూసిన వరూధిని    కన్నులేమంటున్నాయో పెద్దన మాటల్లోనే పరికించండి.          
   'విలోకనప్రభావీచికలన్, తదీయపదవిన్ గలశాంబుధివెల్లి గొల్పుచున్ ' విలాసమనే శృంగార చేష్ట చేస్తున్నది వరూధిని.  'దయితావలోకనాదౌ విశేషాంగ క్రియాసు య: శృంగార చేష్ట సహితో విలాసస్సముదీరిత:'  (మాలతీమాధవ వ్యాఖ్య)
                    యానస్తానాసనాదీనాం ముఖనేత్రాది కర్మణాం,
                    విశేషస్తు విలాసహ స్యాదిష్ట సందర్శనాదినా.
 తనకిష్టమైనవారిని చూసినప్పుడు, నడకలో, వునికిలో, కూర్చోవటంలో, మాట్లాడటంలో, చూడటంలోనూ, కనపడే విశేషమే విలాసమనీ, ఒయ్యారమనీ సాహిత్య దర్పణమంటుంది.  వరూధిని ప్రవరుని చూడటంలో యీ ఒయ్యారం కనబడిందట!
               మునుమున్ పుట్టెదు కొంకు  లౌల్యము నిడన్ మోదంబు విస్తీర్ణతన్,
               జొనుపన్, గోర్కులు క్రేళ్ళు ద్రిప్ప మదిమెచ్చుల్ రెప్పలల్లార్ప న
               త్యనుషంగ స్థితి రెచ్చపాటొసగ నొయ్యారంబునన్ జంద్రికల్,
               దనుకన్ జూచె లతాంగి భూసురు బ్రఫుల్లన్నేత్ర పద్మంబులన్.
ఈ పద్యంలో ప్రవరాఖ్యుని చూసిన వరూధిని చూపులను వర్ణిస్తూ, పెద్దన అంటున్నాడు. కొత్తగా వచ్చిన ఆ పురుషుని చూసిన వెంటనే ఆమె చూపులు, సంకోచంవల్ల చలించాయట! అతగాని లోకోత్తర సౌందర్యాన్ని ఆస్వాదించటం వల్ల కలిగిన ఆనందం వల్ల ఆ చూపులు విస్తృతమయ్యాయి.మనసులో కోర్కెలు కొల్లలుగా సందడించటంవల్ల, కనురెప్పలు అల్లలాడసాగాయట! ప్రవరుడు క్రమంగా  దగ్గరకు రావటంచూసి, మ్రాన్పడినట్టుగా నిలచిపోయాయట ఆమె చూపులు!    
ఇలా వివిధ దశల్లో, వరూధిని చూపుల ద్వారా,  అమె అనురాగం వ్యక్తీకరించబడటం వల్ల, ఇక్కడ చూపులు అనుభావములవుతున్నాయని నరస భూపాలీయ వ్యాఖ్య.  (ప్రారూఢ కటాక్షాదిక మారయననుభావమయ్యె)
   ప్రవరుని వేషంలో ఉన్న  యక్షుని చూసిన వరూధిని   కన్నులేమంటున్నాయో పెద్దన మాటల్లోనే పరికించండి.          
               ఆ కమలాక్షి ఇంపున దృగంచల మించుక మూసి హర్ష బా
              ష్పాకుల కోణ శోణరుచులగ్రమునంజనజూచు చూపు తీ
              రై కనుపట్టె  దమ్మరసమంటుకొనన్ వెడవింటివాడు క్రో
              ధైక ధురీణతం గరచి యేసిన సింగిడికోలయోయనన్....  (మను-3/90)
సాక్క్షాత్తూ మన్మధుడే క్రోధారుణమానసంతో ప్రయోగించిన సింగిణికోలయట- ఆ కమలాక్షి చూపు!   
        మనోరమాస్వరోచుల వివాహ వర్ణనలో, మనోరమ చూపులు, 'చటులత లజ్జ దల్లడిలె,జాలరిచేపలబాసి  ధాత్రిపై, నటునిటు మిట్టి మిట్టిపడు నంబుచరంబులవోలె' స్వరోచికి కనబడ్డాయట!
                     రాజుచూడ్కి కపుడు రాజీవముఖి చూడ్కు
                     లెదురుకొనియె లజ్జ గొదికి కొదికి, 
                     జడిసి జడిసి, జహ్ను సంభవాంభోవేణి
                     కెదురు లెక్కు మీల కొదమ లనగ..(5/83)
'కావ్యాలంకర చూడామణి'లోనూ, 'రసగంగాధరం' లోనూ, ఇలా కంటిరెప్పలనుంచీ చూడటమన్న అనుభావం చెప్పకపోయినా, నాయిక లజ్జవల్ల. నాయకుడెదురుగా వున్నా, తలవంచుకుని ఉండటం, ఐనా, కనురెప్పల చివర్ల నుండీ నాయకుని చూడటం మనోహరమే కదా!     
            'పాండురంగ మహాత్మ్యము'లో  తెనాలి రామకృష్ణుడు తన వంతుగా, కాపు కోడలు చూపులను, 'కలగల్పు చూపులు', 'తేలెడు కన్నుదోయి', 'పారవశ్యమున్ బొరసిన నిట్టు చూపులు' అని వింగడించి మరీ చెప్పాడు.
             'విక్రమార్క చరిత్రము' లో జక్కన మదనరేఖ సౌందర్యాన్ని వర్ణిస్తూ, 'వనజాక్షి చూపులు, వలరాజు తూపులు'..అంటాడు. విదర్భ రాజపుత్రి అందాన్ని నారదుడు విక్రమార్కునికి వర్ణించి తెలుపుతూ,
                వెలది సోయగంబు వీక్షింప వినుతింప
               వేయికన్నులమర విభునకిచ్చి,
               రెండుజిహ్వలలండజాధీశున
              కొసగబోలు పంకజోద్భవుండు..
అంటాడు. (4/16) ఆతరువాత,నరమోహినీ వృత్తాంతం లో 
             ఆయంగన క్రేగన్నుల
            యోయారపు గలికిచూపుటురులంబడినన్,
             గాయజునిచిత్తమైనను,
            గాయజసంతాపవహ్నిగరుగక యున్నే? (5/171)
 అంటాడు. ఆమె చూపులబారినపడితే, మన్మధుడికికూడా, మన్మధబాణముల వాడి తగలకపోదు అనటంలో, ఆ   చూపుల శక్తి చెప్పకనే చెప్పినట్టయింది మరి.    గుణవతీ వర్ణనంలో..
                       కలువలుగండుమీలు  దొలుకారు మెరంగులు నీడురామికిం,
                       జెలువుగ నేపదార్థమెనసేయుదునో సతికన్నుదోయికిం?
                      దలచి పయోజసంభవుడు తామరలంబ్రతిసేయబోలు, నౌ
                      బొలుపుగ నెల్లవారు, దమ పుట్టిన ఇండ్లను, బెద్దసేయరే? (7/46)
 కలువలు, గండుమీను చేపలు, తొలుకారు మెరపులు..ఇవేవీ ఆమె కన్నుదోయికి సాటి రాలేదని, పయోజసంభవుడు, చివరికి, ఆమె కన్నులకు ప్రతిగా తామరలను చేశాడత! కరణం-బ్రహ్మ పుట్టినదే తామరలొకదా!పుట్టిన ఇల్లు యెవరికైనా ప్రీతిపాత్రములేకదా అని ముక్తాయింపు. ఇలా కొందరు తెలుగు కవుల కలాల్లో కన్నుల కాంతులిలా ప్రతిఫలించాయి మరి!   
 పింగళిసూరన 'కళాపూర్ణోదయం'లో పువుబోండ్ల చూపులను విశ్లేషించిన తీరిది!
                            బెళుకులు చిమ్ముచున్ గలికి బిత్తరి చూపు సరత్నకుండలాం
                            చల కషణోజ్వలత్వము పసల్ నెరపన్ జళిపించుచున్, భుజం
                           గుల హృదయస్థలుల్ వొడిచి, కొంచక తోడన పోటుగండ్ల దూ
                           రె లలన యౌర! యొక్కొక్కతరిం బువుబోండ్లు కటారి కత్తియల్  (1/32)
     ఇలా తరచి చూస్తూ వెళితే, తెలుగుకవుల కలాలు కళ్ళభాషను కావ్యీకరించిన తీరు మనలను కట్టిపడెస్తుంది-ఆయా కావ్యాలకు!
         ఇదిలాఉండగా,ఇతర భాషాసాహిత్యాలలో కళ్ళకబుర్లేమిటంటే,  మర్యాదాపురుషోత్తమునిగా రాముణ్ణి వర్ణించటంలో తనకు తనే సాటి అనిపించుకునే తులసీదాసు కూడా, యేదొవిధంగా కళ్ళ కదలికలకు అందమైన భాష్యాలు చెప్పాడు.   'రామచరిత్ మానస్' లో సీతాదేవి చూపులను తులసీదాస్ యేమని వర్ణించాడో చూడండి.    స్వయంవరానికి ముందు, గౌరీదర్శనానికి వెళ్ళిన సీత అనుభవమిది.
                  జాని గౌరి అనుకూల్ సియ హియ హరషి న జాయ కహి,
                 మంజుల్ మంగల్ మూల్, వాం అంగ్ ఫరకన్ లగే
గౌరి దర్శనం తరువాత,  సీతకు మనసులో ఉత్సాహం అంకురించింది. దానికి తగ్గట్టే యెడమ వైపు అంగాలన్నీ అదిరాయట-కంటితో సహా! !  కళ్ళు అదరటమూ (పదేపదే కొట్టుకోవటం) కొన్ని పరిణామాలను సూచిస్తుంది. ఆడవారికి యెడమ వైపూ, మగవారికి కుడి వైపు అంగాలు అదరటం శుభ సూచకాలుగా పరిగణించటం- భారతీయ సంస్జృతిలో ఒక భాగం. సీతాదేవి యెడమ కన్ను ఇలాగే అదిరి, రామునితో సమాగమాన్ని సూచించిందట!
 అయోధ్యనుండీ, రామ లక్ష్మణులతో వనవాసానికి వెళ్తున్న సీత కు మార్గమధ్యంలో  కొంత మంది గ్రామీణ స్త్రీలు కనబడ్డారు.
                   బహురి బదను బిధు బంధన్ ఢాంకీ
                   పియ తను చితయీ భౌహ్ కర్ బాంకీ
                   ఖంజన్ మంజు తిరీఛే నయనని
                   నిజ్ పతి కహెవు తిన్ హహి  సియ సయనని
 'వీరిద్దరిలో నీ భర్త యెవరు' అని వారడిగారు. అప్పుడు సీత, సిగ్గుతో తలవంచుకుని, కళ్ళ చివర్ల నుండీ రాముని వైపు చూసిందట! బహుశా, కళ్ళ భాషను ఇంతకంటే ముగ్ధ మనోహరంగా చిత్రించిన కావ్యం ఇంకొకటి లేదేమో! 
          శృంగారశిరోమణిగా ప్రసిద్ధుడైన బిహారీ, కళ్ళభాషను చదవటంలో నిష్ణాతుడు. అతని నాయికానయకులిద్దరూ బహు చతురులు. చుట్టూ, వేలమందివున్నా, కళ్ళతోనే తమ సంభాషణను అతిచాకచక్యంగా కొనసాగించగలరు కూడా!
                   కహత్, నటత్, రీఝత్,ఖిజత్, మిలత్,ఖిలత్, లజియాత్,
                   భరే భౌన్ మే కరత్ హై, నయనన్ హీ సౌ బాత్
చెప్పటం, నటించటం, అలగటం, కలుసుకోవటం, నవ్వటం, సిగ్గుపడటం, ఇలా అనేకవిధాలుగా వందలాదిమంది ముందే చూపులతోనే మాట్లాడే నేర్పు వారి సొంతమట!
       చూపులను కళ్ళాలు లేని అశ్వాలంటాడు కూడా! సిగ్గు అన్న కళ్ళెంతోనూ వాటిని బంధించలేమట! కళ్ళెంతో వాటికి అదుపులోపెట్టుకోవాలని ప్రయత్నించేకొద్దీ, మరీ అదుపుతప్పిపోతాయి సుమా! అంటాడొకచోట! కమలాక్షి, విశాలాక్షి, మీనాక్షి..ఇలా అందమైన కళ్ళను యెన్నివిధాల పోల్చినా లాభమేమీ లేదట! ఆ కళ్ళకు చాతురీమంతమైన భాష తెలిస్తేనే నిజమైన అందమూ, ఆనందమూనూ! అని తేల్చేస్తాడు కూడా!
............
         ఉర్దూ సాహిత్యంలో కళ్ళకు గొప్ప ప్రాధాన్యత ఉంది. గాలిబ్ మరీ ముఖ్యంగా కళ్ళభాషను విశ్లేషించాడు. 18వ శతాబ్దంలో యీ వొరవడి ప్రవేశించినా, 19వ శతాబ్దిలోనే ఆతశ్, శేఫ్తా, మోమిన్, గాలిబ్, జౌక్, దాగ్, హాలీ, అక్బర్, సర్ శార్, వంటి గజల్ రచయితలవల్ల, మరింతగా వేళ్ళూనుకుందనే చెప్పాలి.
            ఇశారో'  ఇశారో మే హుయే ఉన్ సే సవాల్ అక్ సర్,
            నిగాహో నిగాహో మే ముహబ్బత్ కా జవాబ్ ఆయా..
 నోటితో చెప్పలేని విషయాలు అనేకం కళ్ళతో అతి సునాయాసంగా చెప్పివేయటం నిజంగా ఆశ్చర్యమే కదా! ఒక్కోసారి కనురెప్పలు తాటించటం వల్ల కూడా యెన్నో విషయాలు చెప్పటమూ ఉంది.
            ఇష్క్ కా హుస్నే తలబ్ ఇక్ మాని యే బేలఫ్ జ్ హై
            టక్ టకీ బంధ్ జాయేగీ మత్లబ్ అదా హో జాయెగా.. 

............................
Friendz dears...This is the TEXT of my talk entitled    NAYANA NAYA BHASHANAM broadcast on AIR Hyd (in 3 parts of 7 minits each) on 22nd, 29th and coming 5th jan. i will post the next part after completion of it's broadcast pl..........
.........

Wednesday 23 December 2015

maa ayyagaru: శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ...

maa ayyagaru:
శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ...
: శ్రీ అరవిందులవారి రాష్ట్ర స్థాయి సమావేశాలలో మా అయ్యగారిపై   శ్రీ అరవిందులవారి ప్రభావం గురించి కొన్ని అనుభూతులను పంచుకునేనుదుకు...

Tuesday 15 December 2015

                                           అరబిందో




అరబిందో మహర్షి గురించి మా అయ్యగారు విప్లవయోగీశ్వరుడు అని ఒక చిన్న పొత్తము, 1960 లో వ్రాశారు. అరవిందులవారి అవతరణ- రామకృష్ణ పరమహంస మహాసమాధి- ఆగష్ట్ 15 నే కావటం ఘుణాక్షర న్యాయం వంటిదని కొందరంటారు కానీ, భారతదేశ స్వాతంత్ర సిద్ధి కూడా అదెరోజు కావటంలో యెదొ పెద్ద సందేశమే ఉందని వారి భావన. డ్రూయట్ దంపతుల వద్ద తానున్న సమయంలో షేక్స్ పియర్ రచనలను తెగ చదివేవారట అరవిందులవారు! టెన్నీసన్, వర్డ్స్ వర్త్ షెల్లీ, కీట్స్..వీళ్ళందరి హృదయాలనూ వారు ఆపోసన పట్టేశారట! అరవిందులవారి జీవిత సంగ్రహం వ్రాస్తూనే, తనవైన వ్యాఖ్యలను కూడా అక్కడక్కడా ఆనాడే వినిపించేవారు-పుట్టపర్తి వారు.

'దేశభాషలెంత గొప్పవైననూ, భారతీయాత్మను సంపూర్ణముగా వెల్లడింపలేవు.'

'సాహిత్యము, హృదయమును సంస్కరించుచూ, భావములు విశాలమొనర్చును. కానీ, సాధన, మర్గములనుపదేశించును.'


' ఒక దేశము యొక్క విజ్ఞానము, వికాసమొందవలెనన్నచో, నా దేశము స్వతంత్రముగానుండవలయును. స్వాతంత్ర్యమే, సర్వాభ్యుదయమునకూ, మూలము.'

'శంకరులవారి తరువాత, అరవిందులవంటి మేధావి, ప్రపంచమునబుట్టలేదు. అతను విశ్వామిత్రునివంటివాడు. రజప్రేరితమైన యీ తపస్సు-శుద్ధ సాత్వికమై, పరిణామపేశలమైనది. విశ్వామిత్రుడు గాయత్రిని సృష్టించినట్లే, యరవిందులు, భాగవత జీవన విధానమును, నిర్ణయించెను.'

'హిమాలయము వంటి మేధస్సు, క్షీరసముద్రము వంటి కవితాశక్తీ- రెండింటినీ జోడించిన యరవిందుల మూర్తి-చిత్రాతిచిత్రమైనది.'

ఇలాంటి యెన్నో పుట్టపర్తివ్యాఖ్యలతో కూడిన యీ చిన్ని పొత్తము, చిత్తూరులో యి 19, 20వ తేదీలలో జరుగుతున్న రాష్ట స్థాయి  అరబిందో సంస్మరణసభల సందర్భంగా పునర్మిద్రింపబడుతున్నది. (నేనుకూడా వెళ్తున్నాను.)

అరబిందో భావజాలాన్నీ, మార్క్క్ భావజాలాన్నీ కలిపి కొత్త సిద్ధంతాన్ని యెవరైనా కనిపెడితే బాగుండేదనీ, తనకిప్పుడు అ విశ్లేషణ చేయదగినంత మానసిక, దైహిక శక్తులు లెవనీ తన చివరి రోజుల్లో వాపోయేవారు (ఈ దిశగా యెవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడటం లేదింకా..) . అరవిందులవారి ప్రభావం పుట్టపర్తిమీద నిండుగా మెండుగా వుంది మరి...

Rara Venugopabala- Bilahari swarajati

Monday 14 December 2015



              నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3



కడప మోచంపేట (అసలు పేరు మోక్షంపేట అట..క్రమంగా నోరుతిరగక అది మోచంపేటగా ప్రజల్లో స్థిరపడింది..) ఆ ఇంటి పెద్ద అరుగులమీద కూర్చుని చక్కగా నామాలు తీర్చి దిద్దుకుంటున్న మా తాతలే గుర్తొస్తారు నాకు. రాయలసీమలో పితామహులైనా,మాతామహులైనాపిలుపు ఒక్కటే...తాత అని!..అట్లే, అమ్మమ్మైనా, నాన్నమ్మైనా- అవ్వ. అంతే! ఇప్పుడింతకూ, ఆ అరుగుల పైన, చక్కగా పద్మాసనం వేసుకు కూర్చుని మా తాతగార్లిద్దరూ నామాలు పెట్టుకోవటం నాకింకా గుర్తే! అరచేతిలో కాసిన్ని నీళ్ళచుక్కలు వేసుకుని,శ్రద్ధగా భక్తిగా త్రిపుండ్రధారణ చేసుకునే వాళ్ళిద్దరూ నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంటారు.మా పెద్దక్కయ్యలు- కరుణ, తరులత ఇద్దరి కల్యాణాలూ - ఒకే సంవత్సరం 1960లో రెండు మూడు నెలల తేడాతో అయ్యాయి. ఆ పెళ్ళిళ్ళకు మా పితామహులూ, మతామహుల దంపతులొచ్చినప్పటి ముచ్చట ఇది. నా చిన్ని లేత హృదయంలో (నాకప్పుడు 8 యేళ్ళు) అలా నిలిచిపొయిన పన్నీటి వాకలవంటి స్మృతులు.

మా పితామహులు పుట్టపర్తి తిరుమల శ్రినివాసాచార్యుల మా తాతగారు, గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. పెనుగొండ (అనంతపురం జిల్లా) పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసే మా తాతగారు, గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. చక్కటి గాత్ర శుద్ధితో, సంవత్సరాల తరబడి పురాణ కాలక్షేపం చేసేవారట! మా అయ్యగారు తన బాల్యంలో మా తాతగారి పురాణకాలక్షేపంలో పద్యాలు చదువుతుంటే, మా తాతగారు వ్యాఖ్యనం చేసేవారన్న మాట! ఆశువుగా బహుచక్కని శ్లోకాలూ, పద్యాలూ చెప్పగల సత్తా వున్నా, పాతకాలం వాళ్ళందరికీ, వాల్మీకి, వ్యాసూడూ, కాళిదాసులముందు మనమెంత, మన పాండిత్యమెంత అన్న వినయసంపన్నత, కలం పట్టనిచ్చేది కాదు కదా! అందుకేననుకుంటా- మా తాతగారూ, యే రచనా చేయకపోయినా,మా అయ్యగారికి ఆయనంటే అపారమైన గౌరవముండేది. ఆయనముందూ బీడీకూడా కాల్చేవారు కాదు .



మా తాతగారు, మా బాడుగింటి అరుగులపై కూర్చుని, శ్రద్ధగా నామాలు పెట్టుకోవటం కళ్ళువిప్పార్చి అదో అద్భుత ప్రక్రియగా చూసేదాన్ని. మా అయ్యెందుకల నామాలు పెట్టుకోరో అర్థమయ్యేది కాదు.అద్దంలో చూసుకుంటూ, నుదుట యెర్రటి నామం తీర్చి దిద్దుకుని, చక్కగా అమరిన తరువాత, ఒకసారి చూసుకుని తృప్తి చెందేవారు. .


.........


మాయాబజార్ సినిమాలో, యస్వీ రంగారావును ఆట పట్టిస్తూ, 'చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ' అని పాట పాడే వృధ విప్రుని సీన్ చూసినప్పుడల్లా, నాకు మా మాతామహులైన దేశికాచార్యులవారే గుర్తొస్తారు. (మా పెద్దక్కయ్యలు- కరుణ, తరులత ఇద్దరి కల్యాణాలూ - ఒకే సంవత్సరం 1960లో రెండు మూడు నెలల తేడాతో అయ్యాయని, మా అక్కయ్యల పెళ్ళిల్లకోసం వాళ్ళూ వచ్చారని ముందే చెప్పానుగా!) మా మాతామహులు- శ్రీమాన్ దేశికాచార్యులవారూ. మా అమ్మమ్మ, శ్రీమతి శేషమ్మా ఇద్దరూ- నెలరోజుల ముందునించే మా ఇంట్లో ఉన్నట్టు గుర్తు. మా తాతగారు చాలా అమాయకులు. (వారి తండ్రిగారు-శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారు, కాశీ పండితులుగా గజారోహణ గౌరవాన్ని పొందిన ఘనులైనా, వీరు- అమాయకులూ, కాస్త పెద్ద వయసు, సంప్రదాయ చాదస్తమూ- వెరసి కలగలిసిన వ్యక్తిత్వం. ప్రాధమిక పాఠశాలలో పండితుడిగా పనిచేసి రెటైర్ అయ్యారు.) పొద్దున్నే ఆ పెద్ద అరుగులపై కూర్చుని, చాలా శ్రద్ధగా, తిరుచూర్ణంతో (తెలుపూ, పసుపూ) గంటకు పైగా కూర్చుని త్రిపుండ్రధారణం చేసుకునేవారు.పొద్దున్న శ్రద్ధగా తీర్చిదిద్దినట్టు నామాలు పెట్టుకునే మా తాతనుచూస్తే నాకు పెద్ద ఆకర్షణ అప్పట్లో! ఆ అరుగుపైనె కూర్చుని తన అనుష్టానమంతా పూర్తి చేసుకునేవాడాయన ! మా అయ్యగారికీ త్రిపుండ్రధారణల పట్ల అంత ఆసక్తి ఉండేదికాదని ముందే చెప్పినట్టు గుర్తు.

మా అవ్వ- శ్రీమతి శేషమ్మగారికి, కాఫీ అంటే పంచప్రాణాలు. ఇంట్లో వేయించిన కాఫీగింజలను ఇంట్లోనే పౌడర్ చేసే మిషిన్ ఇంట్లో పెట్టింది మా అమ్మ. నిలువ వుంచిన పొడి కంటే, తాజాగా చేసే పొడి సువాసనలు- యెంతో బాగుండేవి. కాఫీగింజలను ఆ మిషిన్ లో వేసి పౌడర్ చేయటం నాపని అప్పట్లో..నేనే చిన్న పిల్లనింట్లో మరి..పొడి యెంత మెత్తగా చేస్తే మా అవ్వ అంత బాగా నన్ను పొగిడేది. 'నీ చిన్న చిన్న చేతులతో చేస్తే పొడి యెంత బాగావస్తుందో' అని ముచ్చటపడేది కూడా..పొగడ్తలకు లొంగని మనసులుంటాయా మరి. (ఆమె పిల్లలకు కథలు చెప్పటంలో బహు దిట్ట. యెన్నెన్నో తెనలిరామకృష్ణుని కథలు రోజులతరబడి చెప్పేది.) .మా తాతైతే, యెప్పుడూ ఆ అరుగులపైనే వున్నా ఇంట్లో కాఫీపొడి సువాసనలను ఇట్టే పట్టేసేవారు. తాజాపొడితో కాఫి కాస్త చేసివ్వమని మా అవ్వను సతాయించేవాడాయన చాలాసార్లు..


(my thathagaru with my mother Kanakavalli - on his right side-and my pinnamma -Alivelamma on his left lap- way back might be in 1927 or '28) Foto courtesy- my cousin Smt.Gudihalam Manjula -daughter of smt Alivelamma)

..............

వారిరువురి తరువాత, నా జ్ఞాపకల దారుల్లోని మరచిపొలేని పరిమళం-శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు. రెండుమూడు సార్లు వారు (సందర్భాలు గుర్తులేవు) మా ఇంటికి వచ్చారు. ఆ చిన్న వయసులో వారి గొప్పతనం నాకు తెలియలేదుకానీ, మా అమ్మా, అయ్యా- వారిని గౌరవించే పద్ధతి వల్ల వీరు చాలా గొప్ప వారు అని మాత్రం తెలిసిందప్పట్లో..(ఆ తరువాత నా 16,17 యేళ్ళ వయసులో వారి అనూదిత గాధా సప్తశతి చదవటం-ఆరాధకురాలినవటం జరిగిందనుకోండి.) వారు కూడా, ఆ ఇంటి అరుగులపై కూర్చుని, శ్రద్ధగా, నామం దిద్దుకోవటం, గుర్తు. వీళ్ళందరికీ, చెంబులో నీళ్ళూ (మరేదైన అవసర వస్తువులూ) అందించెందుకు నేనే నియోగింపబడేదాన్ని మరి..రాళ్ళపల్లివారి అనుష్టానం పద్ధతీ, చిన్న గొంతుతో వారు మాట్లాడే పద్ధతీ, నన్నెంతో ఆకట్టుకున్నాయి అప్పట్లో..
 




............


ఇలా కడప-మోక్షంపేట లో. గుడిపాటి అవ్వగారింట్లో, గడచిన నా బాల్య స్మృతుల్లో (1960 ప్రాంతాలు) ఆ ఇంటి అరుగులతో ముడిపడిఉన్న నా జ్ఞాపకాల పరదాల్లోంచీ తొంగిచూస్తూ. నా కళ్ళముందు కదలాడుతున్న మరికొందరు ప్రముఖులు- , నండూరి విట్ఠల్ గారూ (1960 నుండీ, 80లవరకూ ఆకాశవాణి అజరామర వాగ్మూర్తిగా సుప్రసిద్ధులు) ఊటుకూరి లక్ష్మీకాంతంగారూ (సుప్రసిద్ధ రచయిత్రి) నాయని కృష్నకుమారి గారూ (సువిఖ్యాత రచయిత్రీ, తెలుగు విశ్వవిద్యాలయానికి వుపకులపతిగా గొప్పసేవలందించిన సాహితీవేత్త) వీళ్ళంతా!!!

Wednesday 2 December 2015

sambasivayanave -swarajathi


maa ayyagaru:    Part 4 pl....................ఆయన ప్రయత్నించిన...

maa ayyagaru:    Part 4 pl....
................
ఆయన ప్రయత్నించిన...
:     Part 4 pl.... ................ ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా చాలా గొప్పది. తన కాలానికి   అతీతమైన సామాజిక దృష్టి ఆయనకుండేది. ...

Tuesday 1 December 2015

maa ayyagaru: Part 3 తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు...

maa ayyagaru: Part 3 

తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు...
: Part 3   తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు అనుకునేవాళ్ళం. నన్నయ భారతంవంటి ప్రౌఢరచన హఠాత్తుగా ఒకనాడు ఆవిర్భవించిందంటే నమ్మడం ...